జనవాణిలో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం , ఆగస్టు 5: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమంలో విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలను ఎమ్మెల్యేకు, పార్టీ నాయకత్వానికి సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వయంగా పరిశీలించి, బాధితుల సమస్యలను ఓపికగా ఆలకించారు. సమస్యల స్వరూపాన్ని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని స్పందించే వేదికగా ‘జనవాణి’ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి వినతికి ప్రాధాన్యత ఇస్తూ పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

