మీడియాకు ఇక స్మార్ట్ అక్రిడిటేషన్
QR కోడ్ డిజిటల్ పాస్తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు
నకిలీ మీడియా పాస్లకు చెక్.. నెల్లూరులో ప్రారంభించిన ఎస్పీ డా. అజిత వెజెండ్ల
నెల్లూరు, ఆగస్టు 9: మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు నెల్లూరు పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్ ఆధ్వర్యంలో QR కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ వ్యవస్థను ప్రారంభించారు.
ఈ విధానంలో జర్నలిస్టులకు ప్రత్యేకమైన QR కోడ్ డిజిటల్ పాస్ అందజేస్తారు. QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత మీడియా ప్రతినిధి వివరాలను క్షణాల్లో ధృవీకరించే అవకాశం ఉంటుంది. దీంతో జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు, నకిలీ మీడియా పాస్ల వినియోగానికి అడ్డుకట్ట పడనుంది.
మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సోమవారం కూడా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో QR కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ డా. అజిత వెజెండ్ల తెలిపారు.
మీడియా ప్రతినిధుల గుర్తింపులో సాంకేతికతను వినియోగించడం ద్వారా పారదర్శకత పెంచడంతో పాటు, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు మరింత సౌకర్యం కల్పించడమే ఈ స్మార్ట్ అక్రిడిటేషన్ వ్యవస్థ ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఇదే తరహా QR కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ విధానాన్ని త్వరలో తిరుపతిలోనూ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

