నేలలో దాచిన రూ.5 లక్షలకు చెదలు!
ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బు.. మరిచిపోయిన రైతు.. చివరకు నోట్లన్నీ పనికిరాకుండా పోయిన వైనం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, బలోత్రా (రాజస్థాన్), ఆగస్టు 9: ప్లాట్ విక్రయించగా వచ్చిన రూ.5 లక్షలను దొంగల భయంతో నేలలో దాచిన ఓ రైతుకు ఊహించని షాక్ ఎదురైంది. రాజస్థాన్లోని బలోత్రాకు చెందిన రైతు మంగీలాల్ ఈ డబ్బును భద్రంగా ఉంచాలనే ఉద్దేశంతో భూమిలో పాతిపెట్టి, అనంతరం ఆ విషయాన్నే మరిచిపోయాడు.
ఇటీవల ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన సమయంలో పాతిపెట్టిన నగదు బయటపడింది. అయితే అప్పటికే నోట్లకు చెదలు పట్టడంతో అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. నోట్లపై సీరియల్ నంబర్లు సైతం స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
దెబ్బతిన్న నోట్లను బ్యాంకులో మార్చుకునేందుకు మంగీలాల్ ప్రయత్నించగా, వాటి వివరాలు స్పష్టంగా లేకపోవడంతో బ్యాంకు అధికారులు స్వీకరించేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో చేతికి వచ్చిన రూ.5 లక్షలను కాపాడుకోలేక రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
డబ్బును ఇంట్లో దాచడం కంటే బ్యాంకులో భద్రపరచడం ఎంతో సురక్షితం అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

