చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు వరకు ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి రావడానికి సిద్ధమైంది. 116 కిలోమీటర్ల ఈ హైవేపై అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు.దీనిలో 95 కిలోమీటర్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండటం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.బెంగళూరు–చెన్నై ఎక్స్ప్రెస్వేతో అనుసంధానం కావడంతో పోర్టులకు సరుకు రవాణా వేగవంతం కానుంది.త్వరలో పూర్తిస్థాయిలో వాహనాలకు అనుమతి ఇచ్చి టోల్ వసూళ్లు ప్రారంభించనున్నారు.
చిత్తూరు నుంచి తచ్చూరు వరకు 116 కి.మీ ఆరు లైన్ల హైవే
95 కి.మీ మార్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే
బెంగళూరు–చెన్నై ఎక్స్ప్రెస్వేతో కీలక అనుసంధానం
పోర్టు రవాణాకు భారీ వాహనాలకు గ్రీన్ సిగ్నల్
త్వరలో టోల్ వసూళ్లతో పూర్తి స్థాయి ప్రారంభం
తిరుపతి | పెన్ పవర్ | ఏప్రిల్ 3:
ఆంధ్రప్రదేశ్లో మరో కీలక రహదారి ప్రాజెక్ట్ పూర్తికి చేరువైంది. చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు వరకు నిర్మించిన ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవేపై అధికారులు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 116 కిలోమీటర్ల ఈ హైవేలో 95 కిలోమీటర్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండటం విశేషం.చిత్తూరులోని మాపాక్షి సమీపంలో ప్రారంభమయ్యే ఈ హైవే గంగాధర నెల్లూరు, ఎస్ఆర్పురం, నగరి మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఊతుకోట్టై, కట్టుపల్లి పోర్టు వరకు ఈ మార్గం విస్తరించనుంది. కర్ణాటక నుంచి వచ్చే భారీ వాహనాలు చెన్నై పోర్టులకు త్వరగా చేరేందుకు ఈ హైవే కీలకంగా మారనుంది.ఈ మార్గాన్ని బెంగళూరు–చెన్నై ఎక్స్ప్రెస్వేతో అనుసంధానం చేయడం వల్ల చెన్నై, బెంగళూరు ప్రయాణికులకు కూడా భారీ ఊరట లభించనుంది. గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తే గంటన్నరలోనే తమిళనాడు పోర్టు ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చిత్తూరు, గంగాధరనెల్లూరు, శ్రీరంగరాజపురం, నగరి ప్రాంతాల్లో ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. పనులు దాదాపు పూర్తికావడంతో త్వరలోనే వాహనాలకు పూర్తి స్థాయిలో అనుమతిస్తూ టోల్ వసూళ్లు ప్రారంభించనున్నారు.

