సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ డిమాండ్
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10:
పోలవరం జిల్లా రంపచోడవరం మేజర్ పంచాయతీ కేంద్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తక్షణమే శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతున్నప్పటికీ, దానిని శాస్త్రీయంగా తరలించేందుకు లేదా నిల్వ చేయేందుకు సరైన వేదిక లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. ప్రస్తుతం చెత్తను నివాస ప్రాంతాల సమీపంలో లేదా రహదారుల పక్కన పడవేయడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రంపచోడవరం పరిధిలో తగిన స్థలాన్ని గుర్తించి, ఆధునిక సదుపాయాలతో కూడిన డంపింగ్ యార్డ్ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని కోరారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో చెత్త నిల్వల వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.డంపింగ్ యార్డ్ నిర్వహణకు అవసరమైన నిధులతో పాటు చెత్త తరలింపు వాహనాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బొప్పెన కిరణ్ హెచ్చరించారు.

