నీటి కష్టాలపై సర్పంచ్ను నిలదీసిన మహిళలు
గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 2:
గార్ల మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో తాగునీటి సమస్యపై మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ తదితర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరైన పలు వార్డుల మహిళలు గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ను నిలదీశారు.రోజుల తరబడి నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం సమీప బావుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని, ఇంటి అవసరాలకు సరిపడా నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సమస్యపై సరైన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.నీటి సరఫరా ఎందుకు నిలిచిపోయింది? ఎప్పుడు సక్రమంగా నీరు అందిస్తారు? అంటూ మహిళలు సర్పంచ్ను ప్రశ్నించారు. గ్రామంలోని అన్ని వార్డులకు సమానంగా, క్రమం తప్పకుండా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నీటి సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మహిళల ఆందోళనపై స్పందించిన సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ నీటి సరఫరా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మహిళలు సుజాత రమ్య మంగమ్మ వసంత ఆదిలక్ష్మి సంధ్య మల్లికాంబ శైలజ భాగ్యమ్మ వెంకటమ్మ పద్మ తదితరులు ఉన్నారు.

