నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా తృప్తి క్యాంటీన్ ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన సతీమణి పద్మావతితో కలిసి రిబ్బన్ కత్తిరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా 750 క్యాంటీన్లను మంజూరు చేయగా, అనకాపల్లి జిల్లాలో మొదటి క్యాంటీన్ ఇదేనని తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ క్యాంటీన్ కు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 13.75 లక్షలు లోన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ క్యాంటీన్ ను శ్రీలక్ష్మి ఎస్ ఎల్ ఎఫ్ సభ్యురాలు రహీనాబాను నిర్వహిస్తారని తెలిపారు. మహిళలు, గృహిణిలుగా కాకుండా వ్యాపారవేత్తలుగా ఎదిగి , పది మందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉండటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. లాభాపేక్షతో కాకుండా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. ఈ క్యాంటీన్ విజయవంతం అయితే, మున్సిపాలిటీలో మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్. డి.ఓ వి.వి రమణ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్ నాగరాజు, టిడిపి పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ , మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

